1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (14:14 IST)

హైటెక్ వ్యభిచార అడ్డాగా కరీంనగర్ - గుట్టుచప్పుడుకాకుండా పడకసుఖం

జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ విటులు గుట్టు చప్పుడు కాకుండా పడకసుఖం పొందుతున్నారు. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, వ్యభిచార నిర్వాహకులను అరెస్టు చేస్తున్నా అక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. 
 
గతంలో నగర శివారులోని చింతకుంట, రేకుర్తి, హౌసింగ్‌బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లో వ్యభిచారం ఎక్కువగా నడుస్తుండేది. ఇప్పుడు హైటెక్‌ హంగులతో నగరంలోనే కొందరు యథేచ్ఛగా వ్యభిచారం నడిపిస్తూ నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
 
నిర్వాహకులు తమ పర్మనెంట్‌ కస్టమర్లతో ఒక ప్రత్యేక వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేసి ఆ గ్రూపులోనే యువతుల ఫోటోలు పోస్ట్‌ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కొందరు భార్య భర్తలు కలిసి యువతులతో ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. 
 
మరికొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. విటుల్లో రాజకీయనాయకులు, ప్రముఖ వ్యాపారులు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులు, విద్యాసంస్థల కరస్పాండెంట్లు ఉన్నట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో అయితే వ్యభిచార గృహాలకు ఎవరు వస్తున్నారనే విషయాన్ని స్థానికులు గమనిస్తున్నారని కొత్తదారులు వెతికారు. 
 
నగరంలోని ప్రశాంత వాతావరణంలో ఉన్న కాలనీలు, ఎవరికీ అనుమానం రాకుండా మంకమ్మతోట, జ్యోతినగర్‌, భాగ్యనగర్‌, విద్యానగర్‌, చైతన్యపురి కాలనీ, బ్యాంక్‌ కాలనీల్లో పెద్ద అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, కరీంనగర్‌లోని కొన్ని లాడ్జిలు కేవలం వ్యభిచారం కోసమే నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల, గోదావరిఖని, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి అద్దె ఇళ్ళల్లో ఎవరికీ అనుమానం రాకుండా ఈ వ్యభిచారం నడిపిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. 
 
నగరంలో వ్యభిచారం ఎక్కువవటంతో యువకులు, ఉన్నత చదువులు అభ్యసించిన విద్యార్థులు కూడా ఈ వ్యభిచారంకు అలవాటు పడుతున్నారు. కొంతకాలం కిందట నగరంలో వ్యభిచారం, బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన ఘటనలో పోలీసులు ఒక మహిళను అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన కలకలం సృష్టించింది. 
 
మంగళవారం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సప్తగిరి కాలనీలోని ఒక వ్యభిచార స్థావరంపై దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకులు మానకొండూర్‌ మండలం ముంజంపల్లికి చెందిన దంపతులతోపాటు విటులు హుస్నాబాద్‌కు చెందిన రామడుగు అశోక్‌(30), ఎదులాపురం చందు(24), పొన్నం శంకర్‌(39)ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 37,380 రూపాయల నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు.