1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (14:19 IST)

షర్మిల కొత్త పార్టీపై సరికొత్త ప్రకటన.. అదేంటి?

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. షర్మిల సారథ్యంలో సరికొత్త రాజకీయ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ఆవిర్భంచనుంది. ఆ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు. ఈ పార్టీ ద్వారా తెలంగాణలో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తాన‌ని ఆమె ప్రకటించారు. 
 
అంతేకాకుండా, ఈ కొత్త పార్టీ విధి విధానాల‌పై ఇప్ప‌టికే ఆమె స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఈ పార్టీ రేపును వచ్చే నెల 8వ తేదీన తండ్రి జయంతి రోజున ప్రకటించనున్నారు. ఇందులోభాగంగా, వైఎస్సార్ తెలంగాణ పార్టీగా త‌మ పార్టీ పేరును ష‌ర్మిల రిజిస్ట్రేష‌న్ చేయించారు. ఈ ప్ర‌క్రియ సోమవారంతో ముగిసిన‌ట్లు అధికారికంగా ప్ర‌కట‌‌న వ‌చ్చింది.
 
ఇదే విషయంపై ఆ పార్టీ స‌మ‌న్వ‌యక‌ర్త రాజ‌గోపాల్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ... పార్టీ పేరుపై తన‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఎన్నికల‌ సంఘానికి వైఎస్ విజ‌య‌మ్మ లేఖ రాశార‌ని చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు.
 
వైఎస్సార్  సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్లీ తీసుకు వ‌స్తామ‌ని చెప్పుకొచ్చారు. రాజ‌న్న ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్న‌ట్లు చెప్పారు. ఇప్పటి వరకూ పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు.
 
కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అధికారికంగా దీనిపై సంబంధిత ప‌త్రాలు త‌మ‌కు అందాక పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు  ప్రకటిస్తామ‌ని చెప్పారు.  పార్టీ ఆవిర్భావానికి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్ప‌టికే తాము ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించారు.