1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (17:38 IST)

రాంగ్‌రూట్‌లో వెళ్లిన ఆటో.. ఢీకొన్న కంటైనర్ లారీ - ఆరుగురి మృతి

road accident
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వెళుతున్న ఆటోను వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మద్నూరు నుంచి బిచ్కుందు జాతీయ రహదారిపై ఆటో ఒకటి రాంగ్ రూట్‌లో వెళుతున్నది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళుతున్న కంటైనర్ లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకునిపోయింది. 
 
దీంతో ఆటోలో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటో రాంగ్ రూట్‌లో రావడంతో పాటు కంటైనర్ లారీ శరవేగంగా రావడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు.