ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (12:20 IST)

యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఎలా?

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ ప్రసారమాధ్యంలో పరిచయం ఏర్పడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే ఆ యువతి చేసిన పాపం. ఫలితంగా బలవన్మరణానికి పాల్పడి పుట్టింటి వారికి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ఈ దారుణం హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన దుగ్యాల ఐశ్వర్య(20) డిగ్రీ చదివి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఓ ప్రైవేటు సంస్థలో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంది. ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మారెడ్డి అషేర్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 
 
గత ఏడాది ఫిబ్రవరి 20న సంఘీ టెంపుల్‌లో ఐశ్వర్యను పెండ్లి చేసుకున్నాడు. అయితే కులాలు వేరుకావడంతో పాటు అషేర్‌ అవారాగా తిరుగుతుండటంతో ఐశ్యర్య కుటుంబ సభ్యులు పెండ్లిని అంగీకరించలేదు. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడటంతో వారిద్దరూ విడిపోయేందుకు అంగీకరించారు. 
 
అప్పటినుంచి ఐశ్వర్య హాస్టల్‌లో ఉంటోంది. కొన్నాళ్లపాటు దూరంగా ఉన్న అషేర్‌ ఇటీవల తిరిగి ఐశ్వర్యకు దగ్గరయ్యాడు. తన కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో తరుచూ కలుసుకున్నారు. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గరయ్యారు. దీంతో మూడునెలల క్రితం ఐశ్వర్య గర్భందాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. 
 
కాగా.. ఇటీవల అషేర్‌ సోదరికి వివాహం కాగా ఆమె నెలతప్పింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఐశ్వర్య తనకు అబార్షన్‌ చేయించి అన్యాయం చేశావంటూ అషేర్‌తో గొడవకు దిగడంతో పాటు పెండ్లి విషయమై నిలదీసింది. దాంతో తల్లితో మాట్లాడి చెబుతానంటూ ఇంటికి వెళ్లిన అషేర్‌ ముఖం చాటేశాడు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన ఐశ్వర్య బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లో తాను నివాసం ఉంటు న్న హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలు తీసుకున్న ఐశ్వర్య.. తనను మోసం చేసిన అషేర్‌ను వదిలిపెట్టవద్దని, తన చావుకు కారణం అతడు చేసిన మోసమే అని చెప్పింది. దీంతో పాటు తనను క్షమించాలని, చెప్పిన మాట వినకుండా ప్రేమ పేరుతో మోసపోయానంటూ తండ్రికి కూడా ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.