శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:27 IST)

తెలంగాణ మాజీ మంత్రి నాయిని ఆరోగ్యం విషమం

తెలంగాణ మాజీ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారు.. అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది.

దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్‌ రవి ఆండ్రూస్, మరో డాక్టర్‌ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.  
 
భార్య, అల్లుడు, మనుమడికి కరోనా..
ఇదిలా ఉండగా నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.