శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణ గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కారు : గవర్నర్‌పై నేడు లంచ్ మోషన్ పిటిషన్

tsgovernor
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వైరం అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన గవర్నర్‌ తమిళిసైకు లేఖ రాసింది. కానీ, రాజ్‌భవన్ నుంచి ఇప్పటివరకు అనుమతి రాలేదు. మరో నాలుగు రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభంకావాల్సివుంది. 
 
ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తప్పనికావడంతో ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. అందుకే గవర్నర్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేయనుంది. ఇందుకోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను రంగంలోకి దించింది. బడ్జెట్‌కు గవర్నర్ తక్షణం ఆమోదం తెలిపేలా ఆదేశివ్వాలని ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరనుంది. 
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఇతర విషయాల్లో సరేకానీ, బడ్జెట్ ఆమోదం విషయంలో గవర్నర్ విచక్షణకు తావుండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ ఆమోదానికి ఈ నెల 21వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ పంపింది. అయినప్పటికీ ఇంతవరకు ఆమోదం లేకపోవడంతో కేసీఆర్ సర్కారు కోర్టునే ఆశ్రయించడానికి మొగ్గు చూపింది. 
 
అయితే, కోర్టులు గవర్నర్‌ను ఆదేశించలేవన్న విషయం గతంలో పలు సందర్భాల్లో స్పష్టమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.