1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:15 IST)

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : క్యాంపుల నుంచి పోలింగ్ కేంద్రాలకు

తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు స్థానిక కోటాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలోభాగంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే, రెండు స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఏర్పడింది. ముఖ్యంగా తెరాస అభ్యర్థులకు ఈ రెండు స్థానాల్లో విపక్ష పార్టీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. 
 
ఆ రెండు స్థానాల్లో ఒకటి మెదక్, ఖమ్మం స్థానాలు ఉన్నాయి. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నుంచి తెరాస అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. ఇకపోతే, కరీంనగర్‌ స్థానంలో మాత్రం ఆసక్తికర పోటీ నెలకొంది. దీంతో ఓటు హక్కు కలిగిన వారిని ఇప్పటివరకు ప్రత్యేక శిబిరాల్లో ఉంచారు. శుక్రవారం పోలింగ్ కావడంతో క్యాంపుల నుంచి శిబిరాలకు తరలిస్తున్నారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం  
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
మెదక్, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను కల్పించారు. సీసీ టీవీ కెమెరాలతోపాటు వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదీన చేపడుతారు.