శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (14:16 IST)

దీదీపై కంగనా సెటైర్లు.. రాక్షసుడితో పోలిక.. ట్విట్టర్ ఖాతా సస్పెండ్

Kangana Twitter
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై వరుస ట్వీట్లతో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ విమర్శలు గుప్పించింది. దీంతో నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. మమతా బెనర్జీపై వరుస ట్వీట్లలో నటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఆదివారం (మే 2) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత రాష్ట్రంలో జరిగిన హింసకు నటి మమతా బెనర్జీని నిందిస్తూ.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు మమతను రాక్షసుడితో పోల్చడంతో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది.
 
కాగా.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీదీ నాయకత్వంలోని టీఎంసీ 215 సీట్లు కైవసం చేసుకొని వరుసగా మూడోసారి విజయం సాధించింది. అయితే రాష్ట్రాన్ని గెలుచుకున్న మమతా బెనర్జీ.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన నందిగ్రామ్‌లో ఓటమి పాలయ్యారు.
 
తన మాజీ అనుచరుడు, కుడిభుజంగా చెప్పుకునే సువేందు అధికారి (బీజేపీ) చేతిలో మమత ఓటమిని చవిచూశారు. ఈ విషయంపై కూడా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. ఎమ్యెల్యేగా ఓడిన దీదీ.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ కంగన ప్రశ్నించింది. అందుకే రాజకీయాలంటే తనకు నచ్చడం లేదని తెలిపింది. ఎవరి చేతిలో కొరడా ఉంటే వారే రింగ్ మాస్టర్ అవుతారు. బతికి బయటపడ్డవారే నియంతలగా మారతారు’ అని దీదీని ఉద్దేశిస్తూ కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.
 
 2001లో ఒక్క సీటూ లేని పొజిషన్ నుంచి ఇప్పుడు 75 సీట్లు గెల్చుకోవడం బీజేపీ బలాన్ని తెలియజేస్తోందని కంగన ట్వీట్ చేసింది. వీటన్నింటిని కంటే ముఖ్యంగా సీఎం మమతను ఓడించడం పెద్ద విశేషమని పేర్కొంది. ఇలా వరుస ట్వీట్లతో ట్విట్టర్‌లో మమతపై విమర్శలు గుప్పించిన కారణంగా కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా సస్పెండ్ అయ్యింది.