బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (09:56 IST)

కరోనా సోకింది.. 2 వారాలు ఫోన్లు చేయొద్దు : విజయేంద్ర ప్రసాద్

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ కథారచయిత విజయేంద్రప్రసాద్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయి, వైద్యుల సలహాల మేరకు నడుచుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. "నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నా స్నేహితులు, వృత్తిపరమైన భాగస్వాములు... దయచేసి రెండు వారాలు ఫోనులు చేయవద్దు" అని విజయేంద్రప్రసాద్‌ కోరారు. 
 
ఇదిలావుండగా, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. తనకు కరోనా సోకిన విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చిన వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లానని తెలిపింది. 
 
వైద్యుల సలహాల మేరకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించింది. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కత్రినా సూచించింది. తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు పొంగిపోతున్నానని, ప్రతిఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని అమ్మడు ఓ ప్రకటన చేసింది.
 
అలాగే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సోదరుడు ఎంకే తమిళరసుకు కరోనా వైరస్‌ సోకింది. గత కొద్ది రోజులుగా తమిళరసు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజులకు ముందు వైద్య పరీక్షలు చేసుకున్నారు. 
 
ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో చికిత్స నిమిత్తం చెన్నై గ్రీమ్స్‌రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులకు ముందు స్టాలిన్‌ సోదరి, డీఎంకే ఎంపీ కనిమొళి కూడా కరోనా వైరస్‌ బారినపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.