1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (10:54 IST)

మరో లెజండరీ సింగర్ కన్నుమూత - ప్రధాని మోడీ సంతాపం

bhupinder singh
భారతీయ చిత్రపరిశ్రమ మరో లెజండరీ సింగర్‌ను కోల్పోయింది. ఆయన పేరు భూపిందర్ సింగ్. ఎన్నో మధుర గీతాలను ఆలపించిన ఈయన సోమవారం రాత్రి కన్నుమూశారు. ఈయన మరణంతో బాలీవుడ్​లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​ అని తెలిసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయితే ఆయనకు పెద్ద పేగు క్యాన్సర్​ ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.
 
కాగా, భూపిందర్ సింగ్ ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్​లో ఎన్నో సుమధురమైన గీతాలను ఆలపించారు. అనేక మంది దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. 'నామ్ గమ్ జాయేగా', 'దిల్ ధూండతా హై', 'దో దివానే షెహర్ మే', 'ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే', 'తోడి సి జమీన్ తోడా ఆస్మాన్', 'దునియా చూటే యార్ నా చూటే' వంటి అనేక క్లాసిక్​ పాటలు పాడారు భూపిందర్ సింగ్.
 
మరోవైపు భూపిందర్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన పాటలు ఎంతో మందికి కదిలించాయన్నారు. దశాబ్దాల పాటు చిరస్మరణీయమైన పాటలను అందించిన భూపిందర్ సింగ్​జీ మరణం బాధగిలిగిందన్నారు. అలాగే, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నివిస్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.