1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:56 IST)

రవితేజ ప‌క్క‌న మ‌రో నాయిక‌గా గాయత్రి భరద్వాజ్

Gayatri Bhardwaj
రవితేజ, ద‌ర్శ‌కుడు వంశీల పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు రేపు ఉగాది రోజున గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా, పండుగ సందర్భంగా సినిమా ప్రీ-లుక్ కూడా విడుద‌ల‌ చేయబడుతుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ స‌మ‌ర్ప‌కులు.
 
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇందులో మరో నటి కనిపించనుంది. ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. నూపూర్‌కి లాగే గాయత్రీ భరద్వాజ్‌కి కూడా ఇది మొదటి సినిమా. సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కూ నటించేందుకు మంచి స్కోప్ ఉంటుంది.
 
గాయత్రీ భరద్వాజ్ fbb కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018గా ఎంపికైంది. ఆమె సెఫోరా మిస్ గ్లామరస్ లుక్, జియో మిస్ పాపులర్, కొడాక్ లెన్స్ మిస్ స్పెక్టాక్యులర్ ఐస్, మిస్ ఇండియా ఢిల్లీ 2018 మొదలైన టైటిళ్లను కూడా గెలుచుకుంది. ఆమె న‌టించిన‌ వెబ్ సిరీస్ దిండోరాలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. 
 
టైగర్ నాగేశ్వరరావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. స్టూవర్ట్‌పురంలో పేరుమోసిన నాగేశ్వరరావు  జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు రవితేజకు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. ఇది ర‌వితేజ‌కు మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌.
 
శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. R Madhie ISC కెమెరా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. మయాంక్ సింఘానియా సహ నిర్మాత.