శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (18:19 IST)

మా కుటుంబ సభ్యులందరికీ కరోనా నెగెటివ్ : ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్

కరోనా వైరస్ బారినపడినవారిలో సినీ దిగ్గజం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీ కూడా ఉంది. తొలుత రాజమౌళికి ఈ వైరస్ సోకింది. ఆయనకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. గత రెండు వారాలుగా వారంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో రాజమౌళి కుటుంబ సభ్యులంతా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు రాజమౌళి ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా బారినపడిన తన కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు నెగెటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. 
 
"రెండు వారాల క్వారంటైన్ పూర్తయింది. ప్రస్తుతం లక్షణాలేమీ లేవు. పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు టెస్టులు నిర్వహిస్తే మా అందరికీ నెగెటివ్ వచ్చింది. ప్లాస్మా దానం చేయాలని చూస్తున్నాం. అయితే, డాక్టర్లు మూడు వారాలు ఆగాలని అన్నారు. ప్లాస్మా దానానికి తగినన్ని యాంటీబాడీలు అభివృద్ధి చెందేందుకు సమయం పడుతుందని చెప్పారు" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 
 
కాగా, తెలుగు చిత్ర పరిశ్రమలో తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత దర్శకుడు తేజతో పాటు.. మరికొదరు ఈ వైరస్ బారిపడ్డారు. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.