గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 19 జూన్ 2021 (21:17 IST)

హైదరాబాద్‌లో మనందరి ఇల్లు, తినడానికి తిండి, అన్ని సౌకర్యాలు ఫ్రీ

హైదరాబాద్‌లో మనందరికి సొంత ఇళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. మనకు ఓ ఇల్లు ఉంది. అదే అందరి ఇల్లు. ఈ ఇంటికి ఎవరైనా రావచ్చు.. తినొచ్చు. మీ పనులు చూసుకుని వెళ్ళొచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంకా చదవండి..
 
కరోనా కష్టకాలంలో మన సొంతవాళ్ళే దగ్గరకు రానివ్వని పరిస్థితి. కోవిడ్ వచ్చిందని తెలిస్తే ఇంట్లోకి కూడా రానివ్వని పరిస్థితి. కానీ ఆ ఇంట్లోకి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. స్వయంగా ఆహారం వండుకుని తిని వెళ్ళొచ్చు. అచ్చం మీ ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే ఉండొచ్చు.
 
ఇంట్లో నుంచి పారిపోయిన వారు, వృద్థులు, పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు ఇలా ఎవరైనా రావచ్చు. తినొచ్చు. వెళ్ళొచ్చు. ఆకలితో అలమటించే వారికి ఆ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. నగరానికి ఏదైనా పనిమీద వచ్చే వారికి, ఆసుపత్రికి వచ్చేవారికి ఇక్కడ ఎప్పుడూ భోజనం దొరుకుతుంది.
 
అందుకే ఈ ఇంటిని అందరి ఇళ్ళూ అంటారు. 15 యేళ్ళ క్రితం ఈ ఇంటిని ప్రారంభించారు. అందరికీ ఆహారం. అందరికీ శ్వాస అన్న కాన్సెప్ట్‌తో ఈ ఇంటిని స్థాపించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఎవరైనా ఈ ఇంట్లోకి రావచ్చు. ఎవరి అనుమతి అవసరం లేదు.
 
వండుకుని తినేందుకు బియ్యం, కూరగాయలు సిద్ధంగా ఉంటాయి. 2007 సంవత్సరంలో డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కామేశ్వరి ఈ ఇంటిని ప్రారంభించారు. ఆకలి కడుపులకు అభయమిచ్చేలా, డబ్బులు లేని వారి కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎప్పుడూ నిండుకోలేదు. అలా అని సహాయం అడగరు.
 
దంపతులకు వచ్చే ఆదాయాన్ని కొంతమొత్తాన్ని ఈ ఇంటికి కేటాయిస్తున్నారు. రోజుకు వందమందికి పైగా ఆహారాన్ని ఇక్కడ పెడతామని డాక్టర్ సూర్యప్రకాష్ చెబుతున్నారు. ఇక్కడకు ఆకలి కోసం వచ్చేవారికే కాకుండా నిరుద్యోగులు, మానసిక ఒత్తిడి ఉన్న వారు ఇక్కడకు వచ్చి ప్రశాంతంగా గడుపుతుంటారు. ఇంకా సమస్య పెద్దది అనుకుంటే అక్కడే ఉన్న గంటను కొట్టి డాక్టర్‌కు సమస్యను చెప్పుకోవచ్చు. వారికి చేతనైనంత సహాయం చేస్తుంటారు.
 
ఇక్కడకు ఎంతోమంది నిరుద్యోగులు వస్తుంటారు. వారికి అందుబాటులో లైబ్రరీ, రీడింగ్ రూం కూడా ఉందట. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా వాళ్ళకు వచ్చే కొంత ఆదాయాన్ని సమాజ సేవలో ఖర్చు చేయడం గొప్ప విషయం.