శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 మే 2022 (17:38 IST)

ఎన్టీఆర్ జిల్లాలో తన చెల్లికి న్యాయం జరగడం లేదని ఎడ్ల బండిపై ఢిల్లీకి యాత్ర

bullock cart
తన సోదరికి న్యాయం జరగడం లేదంటూ ఓ అన్న ఎడ్లబండి యాత్రను ఎన్టీఆర్ జిల్లా నుంచి ఢిల్లీకి ప్రారంభించాడు. ఎడ్లబండిపై తన తల్లితో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ సుప్రీంకోర్టుకి, మానవ హక్కుల కమిషనుకి పిటీషన్ సమర్పించి తన చెల్లి కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నాడు. ప్రస్తుతం అతడి ఎడ్లబండి యాత్ర ఖమ్మం జిల్లా దాటింది.

 
వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళ గ్రామంలో నివాసం వుంటున్నారు నాగదుర్గారావు అతడి కుటుంబం. తన సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కి ఇచ్చి 2018లో ఘనంగా వివాహం చేసామనీ, కట్నంగా 23 లక్షలతో పాటు 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చామని చెప్తున్నాడు. ఇంత ఇచ్చినా తన సోదరిని ఆమె అత్తమామలు వేధిస్తున్నారనీ, దాంతో తన చెల్లిని ఇంటికి తీసుకువచ్చిట్లు తెలిపాడు.

 
తన చెల్లి భర్త, అత్తమామల వేధింపులపైన చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారి పలుకుబడితో కేసు ముందుకు కదలకుండా చేసారని వాపోయాడు. అందుకే ఢిల్లీలో న్యాయం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకుని ఎడ్ల బండిపై బయలుదేరినట్లు చెపుతున్నాడు.


ఇక్కడ న్యాయం జరగదని భావించి తన తల్లితో కలిసి ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టులోనూ, హ్యూమన్ రైట్స్ కమిషన్ లోనూ తన చెల్లికి జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సోదరి కోసం అన్నయ్య చేస్తున్న ఎడ్లబండి యాత్ర చర్చనీయాంశంగా మారింది. ఈరోజుల్లో పెళ్లయ్యాక ఎవరి బాధ వాళ్లది అనకునేవారు చాలామంది వున్నారు, ఐతే అందుకు భిన్నంగా సోదరి కోసం అన్న చేస్తున్న పోరాటంపై చర్చించుకుంటున్నారు.