బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

ప్రెస్ కౌన్సిల్ నోటీసు ముఖంపై లాగిపెట్టి కొట్టినట్టే: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా నియంత్రణ కోసం తీసుకువచ్చిన 2430 జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దృష్టి సారించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దుర్మార్గపు జీవో 2430 అంశంపై పీసీఐ సుమోటోగా స్పందించడం ద్వారా జగన్ సర్కారు ముఖంపై లాగిపెట్టి కొట్టినట్టయిందని వ్యాఖ్యానించారు. 
 
నిజాలను నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులను, సామాజిక మాధ్యమాల్లో ప్రజా సమస్యలపై గళం విప్పే సామాన్యులను వేధించేందుకే ఈ జీవో తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ సర్కారు ఈ జీవోను వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 
 
అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. ఏపీలో రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తే టీడీశాట్ మందలించిందని తెలిపారు. రోజుకు రూ.2 లక్షలు జరిమానా విధించినా వైఎస్ జగన్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. 
 
ఇప్పుడు చీకటి జీవో 2430పై పీసీఐ స్వయంగా స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసిందని వెల్లడించారు. 'వినాశకాలే విపరీతబుద్ధి అన్నారు, మొట్టికాయలు పడేదాకా వీళ్లకి కళ్లు తెరుచుకోవు' అంటూ ట్వీట్ చేశారు.