శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (08:08 IST)

ఆ రాష్ట్రంలో నరమాంస భక్షకులు ... పది మందిపై కేసు

ఇటీవలి కాలంలో మంచితనం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. మనుషులను మనుషులే చంపేస్తున్నారు. చిన్నపాటి విషయానికి కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాశిలో నరమాంస భక్షకుల వ్యవహారం కలకలం రేగింది. ఈ జిల్లాలో కొందరు మాంత్రికులు పుర్రెతో నృత్యాలు చేసిన వీడియో కలకలం రేపుతోంది. వారంతా నరమాంసం తిన్నారన్న అభియోగంపై పోలీసులు 10 మందిపై కేసులు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెన్‌కాశిలోని కల్లురాణి గ్రామంలో జరిగిన ఓ వేడుకలో ఈ పుర్రెలకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్‌ అయింది. దీంతో ఆ గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అనంతరం కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకొనేందుకు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు.
 
ఆ సమయంలో మాంత్రికులు మత్తులో ఉన్నారని, ఆ గ్రామ దేవత వారిని ఆవహించిందని పేర్కొంటున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, సగం కాలిన మృతదేహాన్ని ఏదైనా గ్రామంలోని శ్మశానవాటిక నుంచి  తీసుకొచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019లో కూడా ఇదే గ్రామంలో కొందరు వ్యక్తులు మనిషి పుర్రెను తీసుకొచ్చి ఇదే తరహాలో ప్రదర్శించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.