శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (10:05 IST)

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!!

death
బీహార్ రాష్ట్రంలోని సిద్ధేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయానికి మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఫలితంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. 
 
జెహానాబాద్ జిల్లాలోని వనహార్ హిల్స్‌లో ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో ఈ తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, శ్రావణమాసం నాలుగో సోమవారం (ఉత్తరాదిలో) పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున సిద్ధేశ్వర్ స్వామి శివాలయానికి తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండటం, సమయం గడుస్తున్న కొద్దీ మరింత భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట ఒక్కసారిగా జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.