ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్కు గుండెపోటు
ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్ గుండెపోటు గురయ్యాడు. వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వాహనదారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఠాణె జిల్లా అంబర్ నాథ్ ప్లైఓవర్పై శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. శివసేన పార్టీ నేత కిరణ్ చాబే కారులో వెళుతుండగా డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యాడు. అంబర్ నాథ్ ప్లైఓవర్ పైకి ఎక్కిన తర్వాత కారు అదుపుతప్పింది.
ఎదురుగా వస్తున్న బైక్లు, ఇతర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. కారు డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు వాహనదారులు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ చాబె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.