ఇకపై సర్వం ఆధార్ మయం - రెస్టారెంట్లలో ఎంట్రీకి తప్పనిసరి
ఆధార్ కార్డు వినియోగంలో కేంద్రం ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఇకపై మున్ముందు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, అపార్టుమెంట్లలో ప్రవేశానికి ఆధార్ తప్పని చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఆఫ్లైన్ వెరిఫికేషన్ను తీసుకునిరానుంది. ఈ కొత్త యాప్ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రవేశపెట్టనుంది. ఆధార్ వివరాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హోటళ్లు వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు గుర్తింపు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పిస్తున్నాం. దీనివల్ల కార్డుపై ఉన్న చిరునామా, ఫోన్ నంబర్ వంటి సున్నితమైన సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా యూఐడీఏఐ కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. దీని ప్రకారం ఆధార్ కార్డుపై పూర్తి వివరాలు లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా మార్పులు చేయనున్నారు.
ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త ఆఫ్లైన్ ధ్రువీకరణ వ్యవస్థ పూర్తిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. 'ప్రూఫ్ ఆఫ్ ప్రెజెన్స్' అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తారు. ఈ విధానంలో యూఐడీఏఐ సర్వర్లతో సంబంధం లేకుండానే యాప్ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని గుర్తిస్తారు. ఇది ప్రస్తుతం బ్యాంకులు వినియోగిస్తున్న ఫేస్ అథెంటికేషన్కు భిన్నమైంది.
ఈ విధానం అమల్లోకి వస్తే హోటళ్లు, లాడ్జిలు, సినిమా హాళ్లు, ఆఫీసులు, ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల గుర్తింపు వంటి అనేక చోట్ల సురక్షితంగా వెరిఫికేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన ఏ సంస్థ అయిన ఆఫ్లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీగా నమోదు చేసుకుని ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇందుకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త యాప్ ప్రస్తుతం చివరి దశ టెస్టింగులో ఉందని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలను విడుదల చేస్తామని యూఐడీఏఐ అధికారులు తెలిపారు.