శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: బుధవారం, 10 ఆగస్టు 2016 (13:22 IST)

తిరుమల వెంకన్న ముందు ఆంజనేయస్వామికి బేడీలేసి నిలబెట్టారు... ఎందుకు..?

సాధారణంగా తప్పు చేసిన వారికి జైలుశిక్ష వేస్తుంటారు. నిందితులను బేడీలేసి తీసుకెళుతుంటారు. ఇది ఇప్పటిది కాదు... ఎన్నో యేళ్ళుగా దేవుళ్ళ నుంచి వస్తున్న ఆచారమని పురాణాలే చెబుతున్నాయి. అందుకు నిదర్శనమే తిరుమలలోని ఆంజనేయ స్వామి. తిరుమలలో అల్లరచిల్లరగా ఆంజనే

సాధారణంగా తప్పు చేసిన వారికి జైలుశిక్ష వేస్తుంటారు. నిందితులను బేడీలేసి తీసుకెళుతుంటారు. ఇది ఇప్పటిది కాదు... ఎన్నో యేళ్ళుగా దేవుళ్ళ నుంచి వస్తున్న ఆచారమని పురాణాలే చెబుతున్నాయి. అందుకు నిదర్శనమే తిరుమలలోని ఆంజనేయ స్వామి. తిరుమలలో అల్లరచిల్లరగా ఆంజనేయస్వామి తిరుగుతుంటే ఆయన తల్లి అంజనాదేవి కాళ్ళకు బేడీలను కట్టి శ్రీవారి ముందు నిలబెట్టిందట. మీరే ఆంజనేయుడిని చూసుకోవాలని కూడా అంజనాదేవి శ్రీవారిని ప్రార్థించిందని పురాణాలు చెబుతున్నాయి. క్రీ.శ.1841 సంవత్సరం కంటే ముందు ఈ సంఘటన జరిగినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు ఆంజనేయస్వామి తిరుమలకు వచ్చి అల్లరచిల్లరగా తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇప్పుడు తెలుసుకుందాం...
 
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు, శ్రీవారికి అనుసంధానకర్తగా తొలిగా అందరికీ దర్శనమిచ్చేది రామభక్తాగ్రేసరుడైన శ్రీ బేడి ఆంజనేయస్వామి. తిరుమల శ్రీనివాసుని సన్నిధి వీధిలో శ్రీ వేంకటేశ్వరునికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు కాళ్ళకు బేడీలు తగిలించుకుని నిలిచి ఉన్న శ్రీ బేడీ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. ఇక్కడ అంజనాద్రిలో అల్లరచిల్లరగా తిరుగుతూ నానారభస చేస్తున్న హనుమంతుడి కాళ్ళకు, చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికి కదలకుండా శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందట అంజనాదేవి. అందువల్లే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు.
 
కానీ క్రీ.శ.1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల ఉత్తరదేశమైన పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సంప్రదాయమే ఈ బేడీ ఆంజనేయస్వామి అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆంజనేయస్వామి ఆలయం ముఖ మండపం, గర్భాలయం అని రెండు భాగాలుగా నిర్మింపబడింది. గర్భాలయంలో గోడవరకూ మధ్యలో సుమారు 6 అడుగుల నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గర్భాలయంపై ఏక కలశ గోపురం నిర్మింపబడింది. గోపురానికి నాలుగుమూలల్లో ఆనంద నిలయానికి వలెనే సింహాలు ఉన్నాయి. ఇటీవలే ఈ ఆలయానికి ప్రదక్షిణ మండపం కూడా నిర్మింపబడింది.
 
ప్రతిరోజు మూడుపూటలా శ్రీ వేంకటేశ్వరుని నివేదనానంతరం భక్త శిఖామణియైన శ్రీ బేడీ ఆంజనేయస్వామికి నైవేద్యం జరుగుతోంది. ఈ నివేదన శ్రీ స్వామివారి ఆలయం నుండే పంపబడుతున్నది. ప్రతి ఆదివారం ఈ మూర్తికి పంచామృతాభిషేకం పూజా నివేదనాలు జరుగుతున్నాయి. ప్రతినెలా పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామలక్ష్మణులు ఊరేగుతూ ఇక్కడకు వస్తారు. శ్రీ సీతారామలక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయస్వామివారికి ఇస్తారు. శ్రీరాముల వారి మెడలోని పుష్పహారాన్ని ఈ బేడీ ఆంజనేయస్వామికి సమర్పిస్తారు.
 
ప్రతి బ్రహ్మోత్సవంలో గరుడోత్సవం ఏపీ ప్రభుత్వం ఈ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయం నుండే ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పట్టుపస్త్రాలను సమర్పిస్తారు. శ్రీ బేడీఆంజనేయ... గోవిందా...! గోవిందా..! గోవిందా..!