శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (13:32 IST)

దీపికా పదుకొనె "ఛపాక్" మూవీ రివ్యూ ... కోర్టుకెక్కిన న్యాయవాది

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించిన తాజా చిత్రం "ఛపాక్". ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం జనవరి పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, ఈ చిత్ర ప్రివ్యూ షోను ఢిల్లీలో ప్రదర్శించారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను స్పృశించేలా తీశారని ప్రివ్యూను తిలకించినవారు అభిప్రాయపడుతున్నారు. సో.. ఈ చిత్ర కథను క్లుప్తంగా పరిశీలిస్తే, 
 
లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకొనే నటించి, సొంతంగా నిర్మించిన చిత్రం ఇది. ఇందులో ఆమె మాలతి పాత్రలో కనిపిస్తుంది. మాలతికి కొన్ని కలలు ఉంటాయి. విమాన పైలట్ కావాలని, కుటుంబానికి ఏదో చేయాలని పరితపిస్తూ ఉంటుంది. అయితే, ఆమె కలలు నెరవేరక ముందే ఆమె రెక్కలు తెగిపోతాయి. మాలతిపై ఊహించని విధంగా యాసిడ్ దాడి జరుగుతుంది. ఫలితంగా ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. 
 
ఈ సమయంలో మాలతికి అమోల్ (విక్రాంత్ మెస్సీ) అనే విలేఖరి పరిచయమవుతాడు. ఆయన ఓ స్వచ్ఛంధ సంస్థను నడుతూ యాసిడ్ దాడిలో గాయపడిన ఎందరో అభాగ్యులను దగ్గరకు చేర్చుకుని చికిత్సను అందిస్తుంటారు. దీంతో మాలతి కూడా ఈ సంస్థలో చేరి తనకు తోచిన సాయం చేస్తూ వస్తుంది. అదేసమయంలో తనకు జరిగిన అన్యాయంపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తుంది. మాలతి సాగించిన న్యాయపోరాటానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళుతుంది. 
 
నిజానికి మాలతి ఇంటర్ చదువుతున్న సమయంలో తనకంటే వయసులో 15 యేళ్ల పెద్ద అయిన బషీర్ ఖాన్ ఉరఫ్ బబ్బూ అనే వ్యక్తి ఎదురింట్లో నివసిస్తుంటాడు. అతను మాలతికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తుంటాడు. అతనే మాలతి ముఖంపై యాసిడ్ పోస్తాడు. దీంతో ఆమె ముఖం పూర్తిగా కాలిపోతుంది. అసలు అతను యాసిడ్ దాడి చేయడానికి గల కారణాలు ఏంటన్నది సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించాడు.
 
ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారు దీపిక యాక్టింగ్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమాలోని పలు సీన్లు కంటతడిపెట్టించాయని చెబుతున్నారు. అలాగే సినిమాలోని డైలాగ్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయనే ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. పైగా, ఈ చిత్రంలో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకొనే ఇట్టే ఒదిగిపోయారని వారు చెబుతున్నారు. 
 
మరోవైపు, శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ తరపు న్యాయవాది ఈ సినిమాలో తనకు క్రెడిట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఒక కోర్టును ఆశ్రయించారు. వకీల్ అపర్ణాభట్ ఈ విషయాలను ఫేస్‌బుక్‌లో వివరించారు. తాను యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌కు కొన్ని సంవత్సరాల పాటు న్యాయవాదిగా వ్యవహరించానని అన్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో తనకు క్రెడిట్ ఇవ్వలేదని తెలిపారు. అందుకే తాను ఈ సినిమా ఆపాలంటూ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు అభ్యర్థించానని తెలిపారు.