శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (12:37 IST)

వ్యక్తులు కాదు.. రాజ్యాంగ సంస్థలే శాశ్వతం : హైకోర్టు తీర్పుపై రమేష్ కుమార్

వ్యక్తులు శాశ్వతం కాదనీ రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా తిరిగి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి కొనసాగుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. 
 
ఈ తీర్పు తర్వాత రమేష్ కుమార్ తన స్పందనను తెలియజేస్తూ ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఆ వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలని, సమగ్రతను కాపాడాలని ఆయన చెప్పారు. ఒక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటుందన్నారు.
 
వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాను మళ్లీ పదవిలోకి వచ్చానని ప్రకటించారు. తాను ఇకపై కూడా గతంలో మాదిరిగాననే నిష్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు.
 
ముఖ్యంగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాను. పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
 
బీజేపీ పెద్దల అనుమతితోనే పిటిషన్ వేశా... కామినేని 
కాగా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహారంలో హైకోర్టు వెలువరించిన తీర్పుపై మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ స్పందించారు. రమేష్ కుమార్ తొలగింపులో ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. తాను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని తెలిపారు. 
 
కరోనా విజృంభణ జరుగుతోన్న సమయంలో ఆ విషయాన్ని తీసిపారేస్తూ ఏపీ ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరంగా ఉందని పిటిషనరు అన్నారు. కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా పాజిటివ్‌‌గా తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.