తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం : సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిటీ
తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కల్తీ నెయ్యి కేసులో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూడు గంటలపాటు కొనసాగిన క్యాబినెట్ భేటీలో సిట్ నివేదికపైనా చర్చ జరిగింది. ఆ నివేదికలో పాత్రధారులపైనే చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది.
సిట్ విచారణ, ఛార్జ్షీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్షీట్లో ఎందుకు నమోదు చేయలేదనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది.
మరోవైపు, తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని గత వైకాపా ప్రభుత్వంలో నిర్ధారణ అయినప్పటికీ సంబంధిత సరఫరాదారులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు సరికదా ఆ సంస్థలనే యధాతథంగా కొనసాగించారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిగ్గుతేల్చిన విషయం తెల్సిందే. ఈ నివేదికపై ఏపీ మంత్రి మండలి సుధీర్ఘంగా చర్చించి, అసలు సూత్రధారులను నిగ్గుతేల్చేందుకు ఓ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.