1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (13:03 IST)

పదో తరగతి పరీక్షలు విడుదల... జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలకు మొత్తం 11751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరు కాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 
 
ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు రేపటి (మంగళవారం) నుంచి సప్లిమెంటరీ ఫీజు కట్టుకునే అవకాశం కల్పించారు. 
 
నెల రోజుల్లోపే సప్లిమెంటరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు.
 
విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించనున్నారు. 
 
ఆర్మీ, ఇతరత్రా ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇక జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.