గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (15:24 IST)

మూడేళ్ళ తర్వాత మూసేసే పార్టీ వైకాపా : బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

ఏపీకి భారతీయ జనతా పార్టీ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళ తర్వాత మూసేసే పార్టీ వైకాపా అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఈయన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'వైసీపీ మూసేసే పార్టీ. మూడు సంవత్సరాల తర్వాత ఆ పార్టీ ఉండదు. గ్యారెంటీగా చెబుతున్నా. కావాలంటే రాసిపెట్టుకోండి. మూసేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉండదని అర్థం' అంటూ విష్ణుకుమార్ వ్యాఖ్యానించారు. 
 
తెలుగు దేశం పార్టీ ఓడిపోతుందని తాను ముందే చెప్పానని, అదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నోటికి వచ్చింది చెప్పడానికి తాను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ను కానని విష్ణుకుమార్ సెటైర్ వేశారు. ఇప్పటికే ప్రజలు జగన్ పాలనపై విసుగెత్తిపోయారని చెప్పారు. 
 
ప్రజలకు జగన్ ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారని, కానీ ఇప్పుడు వారికి అది కపట ప్రేమ అని తెలిసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే లోపల వేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
విశాఖలో అక్రమ కట్టడాలంటూ శుక్రవారం రాత్రి నుంచే కూలగొడుతున్నారని చెప్పారు. కోర్టులు శని, ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలని కోరారు. విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని, లేకపోతే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.