గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (12:35 IST)

అఖిలప్రియకు షాక్ - నో బెయిల్ - 3 రోజుల పోలీస్ కస్టడీ

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డికి సకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ నిరాకరించింది. అదేసమయంలో ఈ కేసు విచారణ నిమిత్తం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. 
 
ఓ భూ వివాదంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు దూరపు బంధువులను కొందరు కిడ్నాప్ చేశారు. ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. ఆ తర్వాత విచారించగా కిడ్నాపర్లు ఎవరో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ప్ర‌స్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె బెయిల్ పిటిష‌న్ మ‌రోసారి తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. అంతేకాదు, ఆమెను క‌స్ట‌డీకి ఇవ్వాల‌న్న పోలీసుల పిటిష‌న్‌కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. దీంతో అఖిల ప్రియను మూడు రోజుల పోలీసుల‌ క‌స్ట‌డీకి తీసుకోనున్నారు.
 
ద‌ర్యాప్తులో పురోగ‌తి కోసం ఏడు రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు కోరారు. అయితే, నేటి నుంచి ఈ నెల 13 వ‌ర‌కే ఆమెను పోలీసుల‌ క‌స్టడీకి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. కాగా, మెరుగైన వైద్యం కోసం తనను ఆసుప‌త్రికి తరలించాలని అఖిలప్రియ ఇంత‌కు ముందు పిటిషన్‌ దాఖలు చేయ‌గా ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జైలులోనే అందుబాటులో వైద్యులు, తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది.