శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 అక్టోబరు 2025 (10:42 IST)

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

Flood victims
మొంథా తుఫాన్ తీరం దాటినప్పటికీ బీభత్సమైన వర్షాన్ని కుమ్మరించింది. ఈ వర్షాలతో ఇటు ఆంధ్ర ప్రదేశ్ అటు తెలంగాణ అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణలో పలు మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు ఏపీలోనూ అదే పరిస్థితి వుంది. బాపట్ల జిల్లా పర్చూరులో భారీ వరదలో చిక్కుకున్న 15 మందిని స్థానికులు, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఆయన ఎక్స్ లో ఇలా పేర్కొన్నారు.
 
బాపట్ల జిల్లా పర్చూరులో భారీ వరద కారణంగా హోసన్నా ప్రార్థనా మందిరంలో చిక్కుకుపోయిన 15 మందిని ప్రాణాలకు తెగించి మరి కాపాడిన స్థానికులకు, రెస్క్యూ బృందాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. సమాచారం అందుకున్న వెంటనే స్పందించి 15 నిమిషాల్లో అక్కడకు చేరుకుని వరద నీటిని లెక్కచేయకుండా 15 మందిని రక్షించిన ఆ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రెస్క్యూ బృందం సాహసం మరువలేనిది అంటూ ప్రశంసించారు
 
గర్భిణీని కాపాడిన పోలీసులు
మొంథా తుఫాను సమయంలో గర్భిణీ మహిళను పోలీసులు కాపాడారు. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. సురేష్ వరదల బారిన పడిన గ్రామంలో చిక్కుకున్న గర్భిణీ స్త్రీని రక్షించారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ గర్భిణీ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు మండలం కొణికి గ్రామ పంచాయతీలోని కట్టవారిపాలెం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల కీర్తి పురిటినొప్పులకు గురైంది. 
 
మొంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా లోయలు పొంగిపొర్లడంతో, గ్రామం అత్యవసర సేవలకు పూర్తిగా దూరమైంది. 108 అంబులెన్స్ ఆమెను చేరుకోలేకపోయింది. 
 
వైద్య అత్యవసర పరిస్థితి గురించి సమాచారం అందుకున్న ఎస్ఐ సురేష్, కొణికి గ్రామ మహిళా పోలీసు అధికారి ప్రియ, మహిళా హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మేశ్వరి, హెడ్ గార్డ్ రామకృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా పోలీసు అధికారి సహాయంతో, వారు గర్భిణీ స్త్రీని జాగ్రత్తగా తమ పోలీసు జీపులో ఉంచారు. తుఫాను పరిస్థితుల మధ్య వరదలున్న లోయ గుండా బృందం ప్రయాణించి కీర్తిని విజయలక్ష్మి ఆసుపత్రికి విజయవంతంగా తరలించారు. అక్కడ ఆమె కవల పిల్లలను సురక్షితంగా ప్రసవించింది. 
 
ప్రస్తుతం తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యం స్థిరంగా ఉందని నివేదించబడింది. తరువాత తదుపరి వైద్య సంరక్షణ కోసం కుటుంబాన్ని 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.