శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (14:11 IST)

ఏపీలో కరోనా రాకెట్ : మరో 31 పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగదల స్కై రాకెట్‌లా కనిపిస్తోంది. శనివారం కూడా మరో 31 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 603కు చేరింది. ఇందులో 15 మంది చనిపోగా, మరో 42 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇకపోతే, రాష్ట్రంలోని జిల్లాల్లో కర్నూలు జిల్లా కరోనా కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 129 కేసులు నమోదు కాగా, వారిలో 126 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇద్దరు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 126 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 122 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  
 
ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 64 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
 
గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను పరిశీలిస్తే, ఈస్ట్ గోదావరిలో 2, కృష్ణాలో 18, కర్నూలులో 5, నెల్లూరులో 3, ప్రకాశంలో 2, వెస్ట్ గోదావరిలో ఒకటి చొప్పున మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే, చిత్తూరులో 29, అనంతపురంలో 22, గుంటూరులో 122, కడపలో 24, కృష్ణలో 61, కర్నూలులో 129, నెల్లూరులో 67, ప్రకాశంలో 44, విశాఖపట్టణంలో 20, వెస్ట్ గోదావరిలో 35 చొప్పున నమోదయ్యాయి.