శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (22:00 IST)

ఏసిబి అధికారులే కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారా?: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

ఈ నెల 17న ఏసిబి కోర్టు జడ్జి అచ్చెన్నాయుడు ప్రభుత్వ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నందుకు సింబాలిక్ పోలీసు కష్టడికి తీసుకున్నట్లు ఆయనకు సమాచారం ఇచ్చి హాస్పటల్‌లోనే విచారించాలని ఆదేశాలు జారీ చేస్తే కోర్టు ఆదేశాలు ధిక్కరించే విధంగా బుధవారం అర్థ రాత్రి స‌మ‌యంలో ఏసిబి అధికారులు అచ్చెనాయుడిని తమ ఆధీనంలోకి తీసుకోవడం కోసం డాక్టర్లపై వత్తిడి తెచ్చి చేసిన ప్రయత్నం కోర్టు ధిక్కారమవుతుందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.

ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అచ్చెన్నాయుడుకు అవసరమైన మేర రక్షణ కల్పించాలని హైకోర్టు కూడా సూచించింది.

అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి వేళ ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం, అందుకు ఆసుప‌త్రి వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చి అప్పటికప్పుడు డిశ్చార్జి చేసేలా ఒత్తిడి తీసుకురావడం బలహీన వర్గాలపై దాడి చేయడమేనని, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని గద్దె రామమోహన్ అన్నారు.

పోలీసులు, ఎసిబి అధికారులు, వైసిపి నేతల ఒత్తిళ్ళ కారణంగానే డిశ్చార్జికి అనుమతిచ్చామని ప్రభుత్వ హాస్పటల్ వైద్యులు చెప్పటం ప్రభుత్వ కుట్రలకు అద్దంపడుతుందన్నారు. కోర్టులంటే గౌరవం లేదు, కోర్టు తీర్పులంటే లెక్కలేదు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు.

కోర్టులు ఇచ్చే బెయిల్‌పై ఆధారపడిన ముఖ్యమంత్రి, కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా, ఒక మాజీ మంత్రి, బిసి నాయకుడి విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం కుట్ర కాదా అని గద్దె రామమోహన్ ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడుపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా, రెండోసారి శస్త్ర చికిత్సకు కారణమై కూడా, విశ్రాంతి తీసుకోవాల్సిన వ్యక్తి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని, ఇలాంటి కుట్ర రాజకీయాలను ప్రజలు, మేధావులు తిప్పుకొట్టాలని గద్దె రామమోహన్ విజ్ఞప్తి చేశారు.