గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (15:14 IST)

బీజేపీలో చేరిన వైకాపా మాజీ నేత దారుణ హత్య...

murder
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. పార్టీ వీడటాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలే ఈ దారుణానికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆదోని మండలం, పెద్దహరివాణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేఖన్న (50) గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఆ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడంతో ఆయన వైకాపాను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీన్ని స్థానిక వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను గుర్తు తెలియని దుండగులు గొంతకోసి హత్య చేశారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే శేఖన్నకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.