1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 మే 2024 (10:11 IST)

బాబు విదేశీ విద్యా పథకం కింద లబ్ది.. టీడీపీకి ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం యువతి

parveen
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొంది అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం కూడా సంపాదించిన ఓ ముస్లిం యువతి ఆ రుణం తీర్చుకునేందుకు స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఓటు వేయాలనే సంకల్పంతో రెండు రోజుల క్రితం స్వస్థలం గుంటూరు చేరుకున్నారు. 
 
నగరానికి చెందిన చిరుద్యోగి చాంద్ బాషా కుమార్తె మహ్మద్ ఫర్వీన్ 2019లో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకున్నారు. కానీ, అంత స్తోమత లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. ఈ క్రమంలో చంద్రబాబు తీసుకొచ్చిన విదేశీ విద్యా పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారు. దాంతో టీడీపీ సర్కార్ ఆమెకు రూ.15 లక్షలు మంజూరు చేసింది. 
 
ఆ ఆర్థిక సాయంతో ఆమె అమెరికాలోని నార్త్ వెస్ట్ మిస్సోరి వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించారు. ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని తానీ స్థాయికి రావడానికి కారణమైన చంద్రబాబు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె గుంటూరుకు వచ్చారు. 
 
ఈ విషయాన్ని ఆమె మంగళవారం గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవికి తెలియజేశారు. 'నా వంటి పేద విద్యార్థుల బాగు కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేసి చంద్రన్నను గెలిపించుకుంటాం' అని ఫర్వీన్ చెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత బుధవారం గుంటూరు పర్యటనలో ఆమెను పిలిపించుకొని ప్రత్యేకంగా ప్రశంసించారు.