గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (08:49 IST)

రాజన్న పాలనా? రాక్షస పాలనా?: కన్నా

రాజన్న పాలన ఇస్తామని రాక్షస పాలన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బీజేపీ నేతల్ని అమరావతి పరిరక్షణ మహిళలు కలిశారు. అమరావతి రాజధానికి అండగా ఉండాలని లక్ష్మీనారాయణకు వినతిపత్రమిచ్చారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని స్వర్గం చేస్తామని చెప్పిన వైసీపీ.. ఎవరూ సంతోషంగా లేకుండా చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

పార్టీ పరంగా, హిందువులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహాలు పగలగొడుతున్నారని.. మతిస్థిమితం లేని వారు అలా చేస్తున్నారని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. జగన్​మోహన్​రెడ్డి చెప్పే దానికి చేసేదానికి పొంతన ఉండదన్నారు.

'ఇసుక విధానం అమోఘం అన్నారు. ఇప్పుడు వారి పార్టీ నేతలే దోచుకుంటున్నారు. మా పార్టీ నేతలు అడ్డుకుంటే... వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. రాజన్న పాలన ఇస్తామని రాక్షస పాలన చేస్తున్నారు' అని కన్నా విమర్శించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ దాడులు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. హైకోర్టు కర్నూలులో ఉండాలన్నదే మా స్టాండ్ రాజధాని నిర్మాణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న కన్నా.. ఆ నిర్ణయం ఎప్పుడో అయిపోయిందని స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారని.. బాండ్లు కొన్నారని గుర్తు చేశారు. కేంద్రం గుర్తించి.. నిధులు విడుదల చేసిందని.. అహంకార పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

హైకోర్టు కర్నూలులో ఉండాలన్నదే తన స్టాండు అని.. అవినీతి కోసం, స్వార్థం కోసమే రాజధాని మారుస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జనసేనతో కలిసే స్థానిక సంస్థల్లో పోటీ 'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి.

బీజేపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కార్యకర్తలను ఉత్తేజపరిచేలా కార్యాచరణ రూపొందిస్తాం. ఇందుకోసం కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం.

వివిధ ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటించి..ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక చేపడుతుంది. తర్వాత జిల్లాల వారీగా ఇన్​ఛార్జ్​లను నియమించి నిర్ణయం తీసుకుంటాం' అని కన్నా స్పష్టం చేశారు.