1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (12:56 IST)

జోరుగా జ‌గ‌న‌న్న ప్లాట్ల అమ్మ‌కం... ఖ‌జానా నింప‌డానికేనా?

ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్రారంభించిన జ‌గ‌న‌న్న ప్లాట్ల ప‌థ‌కం, రాష్ట్ర ఖ‌జానా నింపుకోవ‌డానికే అని రియ‌ల్ట‌ర్లు విమ‌ర్శిస్తున్నారు. చివ‌రికి త‌మ వ్యాపారంలోకి కూడా వ‌చ్చి, కుదేలు అయిపోయిన ఏపీ రియ‌ల్ ఎస్టేట్ ను పాతాళంలోకి తొక్కేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ‌మే ఓపెన్ ప్లాట్ల అమ్మ‌కాల‌కు, లేఅవుట్లు, వెంచ‌ర్ల‌కు దిగితే, ఇక సామాన్య రియ‌ల్ట‌ర్లకు ఇది ఆత్మ‌హ‌త్యా స‌దృశ‌మేన‌ని పేర్కొంటున్నారు.
 
తక్కువ ధరకే ప్లాట్లు అందిస్తామంటూ ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పథకాన్ని ప్రారంభించారు. ప్ర‌భుత్వమే లేఔట్లు వేసి మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఇస్తుందన్నారు. 150 గజాలు, 200 గజాలు, 240 గజాల ప్లాట్లు అందిస్తామని చెప్పారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే మధ్య తరగతి ప్రజలకు ప్లాట్లను అందిస్తామని చెప్పారు. లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్లు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వమే లేఔట్లు వేసి ప్లాట్లను ఇస్తుందని చెప్పారు. ఎంఐజీ (మిడిల్ ఇన్ కమ్ గ్రూప్) లేఔట్లలో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 
 
 
ఇలా ప్ర‌భుత్వ‌మే ముందుకు వ‌స్తే, ఇత‌ర రియ‌ల్ట‌ర్ల వ‌ద్ద ప్లాట్లు ఎవ‌రు కొంటార‌ని వ్యాపారులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం మూడు కేటగిరీల్లో ప్లాట్లను అందిస్తామని చెపుతోంది. ఎంఐజీ-1 కింద 150 గజాలు, ఎంఐజీ-2 కింద 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాల స్థలాన్ని అందిస్తామని జగన్ చెప్పారు. తొలి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లా నవులూరులో లేఔట్లు వేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు నుంచే ప్లాట్లను ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా స్మార్ట్ టౌన్ షిప్స్ కు సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం ప్రారంభించారు. 
 
 
ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును నాలుగు విడతల్లో కట్టే అవకాశం ఉంటుందని జగన్ తెలిపారు. ఒకే విడతలో డబ్బు కట్టే వారికి 5 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. ప్రతి పేద వాడికి ఇల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటి వరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని వెల్లడించారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
 
 
అయితే, ఆన్ లైన్లో అడ్వాన్సులు క‌ట్టించుకోవ‌డం కేవ‌లం ఖ‌జానా నింపుకోవ‌డానికే అని రియ‌ల్ట‌ర్లు పేర్కొంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా హౌసింగ్ ప‌థ‌కాలు పెట్టార‌ని, అమ‌రావ‌తిలో వేసిన లేవుట్లు, భ‌వ‌నాల‌కు ఇంత‌వ‌ర‌కు అతీగ‌తీ లేద‌ని పేర్కొంటున్నారు. పైగా ప్రజ‌ల సొమ్ము హౌసింగ్ లో ఇరుక్కుపోయింద‌ని, ఇపుడు కొత్త‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం రియ‌ల్ ఎస్టేట్ లోకి రావడం త‌మ వ్యాపార‌, ఉపాధి అవ‌కాశాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే అని పేర్కొంటున్నారు.