శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (18:17 IST)

కేశినేని నాని... దేవినేని ఉమ హౌస్ అరెస్ట్

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేస్తున్నారు. అమరావతి ఐకాస ప్రజా చైతన్యయాత్ర విజయవాడ, ఏలూరు మీదుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న నేపథ్యంలో దేవినేని ఉమామహేశ్వరరావును గృహానిర్బంధం చేశారు.

విజయవాడలో కేశినేని నాని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీ కేశినేని నానిని గృహనిర్బంధం చేశారు.
 
సిపిఐ ఖండన
అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరులో రైతులపై, మహిళలపై పోలీసుల లాఠీఛార్జి, అరెస్టును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. "
 
అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ విజయవాడలో శాంతియుత మహిళా ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడం, అమరావతి జేఏసీ నేతలను, మహిళలను అరెస్టులు చేయడం దుర్మార్గం.
 
 రాష్ట్ర ప్రభుత్వం పోలీసు చర్యలతో ఉద్యమాలను అణచాలని ప్రయత్నిస్తోంది. పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అన్నారు
 
పొంగళ్లు వండి... పోలీసులకు ప్రసాదం పెట్టిన అమరావతి మహిళలు
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో పోలీసుల నిర్బంధం మధ్య... మహిళలు పోలేరమ్మకు పొంగలి వండి నైవేద్యం పెట్టారు. పోలీసులకు సైతం అమ్మవారి ప్రసాదం పంచి పెట్టారు. రాజదానిగా అమరావతిని కొనసాగించేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో మహిళలు పోలేరమ్మకు పొంగలి నైవేద్యం పెట్టారు. పోలీసులకు సైతం అమ్మవారి పొంగళ్ళు పంచి పెట్టారు. ఆ ప్రాంతంలో144 సెక్షన్ అమలులో ఉన్నందున ఖాళీ చేయాలని పోలీసులు మహిళలకు తేల్చిచెప్పారు. ఇంతలో అక్కడికి చేరుకున్న శివ స్వామి రాజధాని అమరావతిలోనే ఉండేలాగా కృషి చేస్తామన్నారు.

ఆదివారం రాష్ట్రంలోని అన్ని పీఠాధిపతులు శైవ క్షేత్రంలో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి పీఠాధిపతులంతా లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా వివరించామన్నారు.