1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (13:32 IST)

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారిలో బాబాయ్ కూడా ఉన్నారు : సంచయిత

స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత సంచలన ఆరోపణలు చేసింది. అదీ కూడా ట్విట్టర్ వేదికగా బాబాయ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతి.. ఎన్టీఆర్‌ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉందని ఆరోపించారు.
 
అంతేకాకుండా, పార్టీ పెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబుతో పాటు అశోక్‌గజపతిరాజు గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్‌ ఆ రోజు రాసిన లేఖ ఇది. ఆ నాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది అంటూ లేఖను తన ట్వీట్‌కు సంచయిత జతచేశారు. 
 
అయితే ఈ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. ఇంకొందరైతే మీ లెవెల్ పెరగడం కోసం చంద్రబాబు, అశోక్ గజపతిగారిపై ట్వీట్లు పెడుతున్నారా?.. టీడీపీ కోసం పనిచేస్తున్న కార్యకర్త ఇంట్లో పనిమనిషిగా కూడా నువ్వు పనికిరావు అంటూ తీవ్ర పదజాలంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
 
అంతకుముందు అశోకగజపతి రాజు ఓ ట్వీట్ చేశారు. ఇందులో.. "తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని మరియు మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను" అంటూ పేర్కొన్నారు.