ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (13:01 IST)

ఏపీలో కర్ఫ్యూ ఎత్తివేతకు సీఎం జగన్ నిర్ణయం?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూ సడలింపులను పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. 
 
అయితే, కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక టాస్క్ ఫోర్స్ కమిటీలు మధ్యాహ్నం నుంచే ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీతో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గడువు ముగియనుండటంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది. అలాగే రోజువారీ కేసులు తగ్గుతున్నాయి. కొన్ని జిల్లాలో రోజుకు 50-100 లోపు కేసులు నమోదవుతుండగా.. ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే సగటున 300 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
దీన్ని దృష్టిలో ఉంచుకొని పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించి.. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పూర్తిస్థాయిలో ఎత్తేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.