ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (21:30 IST)

బిపిన్ రావత్ సేవలు శ్లాఘనీయం : పవన్ కళ్యాణ్

దేశ తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం పట్ల జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన సంపాన్ని తెలుపుతూ, రావత్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఈ ప్రమాదంలో రావత్ దంపతులతో సహా 13 మంది సైనికాధికారులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ మరణం కలిచివేసిందంటూ పవన్ కళ్యాణ్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 
 
అత్యున్నత సీడీఎస్ బాధ్యతలు అందుకున్న తొలి అధికారిగా బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం అని వివరించారు. త్రివిధ దళాలను సమన్వయ పరిచి దేశ రక్షణ వ్యవస్థలను పటిష్టపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న రావత్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. 
 
హెలికాఫ్టర్ మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధపడినట్టు గుర్తుచేశారు. మృతుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.