శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (13:08 IST)

సీఎం జగన్ నిర్ణయానికి స్వాగతం... పింక్ డైమండ్‌పైనా సీబీఐ దృష్టిసారించాలి : పవన్ కళ్యాణ్

అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. అయితే, ఇది తొలి అడుగు మాత్రమేనని వ్యాఖ్యానించారు. 
 
అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పవన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిచారు. ఇప్పుడు వేసింది తొలి అడుగు మాత్రమేనని చెప్పుకొచ్చారు. తిరుమలలో మాయమైందన్నట్టుగా అనుమానిస్తున్న పింక్ డైమండ్ పైనా సీబీఐ దృష్టి సారించాలన్నారు.
 
'తొలి అడుగు మాత్రమే... అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరటం అంటే పరిష్కారం అయినట్టు కాదు, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోంది' అని పవన్ ట్వీట్ చేశారు.
 
అంతేకాకుండా, "అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి పిఠాపురం, కొండబిట్రగుంటల్లోని ఘటనల్నీ సీబీఐ పరిధిలోకి తీసుకువెళ్ళండి" అని డిమాండ్ చేశారు. 
 
ఆపై, "ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సీబీఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి" అని ఆయన కోరారు.
 
"వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ ఆరా తీయాలి. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలి. తిరుమల శ్రీవారికి, శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలి" అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.