1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (15:13 IST)

ఒక్క రోజు ఢిల్లీలో ఉంటే వైకాపా ఎందుకు ఉలిక్కిపడుతోంది : పయ్యావుల కేశవ్

payyavula
తమ పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క రోజు ఢిల్లీలో ఉంటే వైకాపా నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారంటూ ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోడీ స్వయంగా వచ్చి పలుకరించి, కరచాలనం చేశారు. ఇది జాతీయ స్థాయిలో సంచలనమైంది. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీలో ఒక్కరోజు ఉన్నారు. దీనిపై వైకాపా నేతలు మతిభ్రమించినట్టుగా మాట్లాడుతున్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనతో ఢిల్లీలో వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాలు సగం కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి నిరభ్యంతరంగా తీసుకురావొచ్చని రాష్ట్రపతి సూచించారు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.
 
మా పార్టీ అధినేతను ఢిల్లీలో అన్ని పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దలు బాగా స్వాగతించారు. రాష్ట్రపతితో భేటీ అద్భుతంగా జరిగింది. ఆమె ఒక తల్లిలా మాతో మాట్లాడారు. రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎంపిక నూటికి నూరు శాతం మంచి నిర్ణయమని ఆమెను కలిశాక వ్యక్తిగతంగా మరింత స్పష్టత వచ్చింది. ప్రత్యేకంగా పొలిట్‌బ్యూరోలో చర్చించి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమం' అని వివరించారు.