శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:19 IST)

మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్, ఎక్కడ ఉన్నారంటే?

పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనావైరస్ సోకింది. కరోనాతో ఆయన రెండురోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం పెద్దిరెడ్డికి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అధికారులు.
 
ఇప్పటికే ఎపిలో ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అలాగే వైసిపిలో కీలక వ్యక్తులు కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు నెలల నుంచి కరోనాకు సంబంధించిన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
 
అయితే గత నెల రోజుల్లో ముందుగా కుమారుడు మిథున్ రెడ్డికి కరోనా సోకింది. 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి వచ్చారు మిథున్ రెడ్డి. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. కానీ సరిగ్గా మూడురోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు.
 
దీంతో పాజిటివ్ అని వచ్చింది. రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రికి వెళ్ళి చేరారు. ఈ విషయాన్ని వైసిపి నేతలు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ బయటకు రానివ్వలేదు. అత్యంత గోప్యంగా ఉంచారు.