1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 12 ఆగస్టు 2021 (10:24 IST)

బలపంపై రామ‌ప్ప‌ శిల్పం... అహో ఏం చిత్రం!

శిల్పం చెక్కాలంటే ఎంత నైపుణ్యం ఉండాలో అంద‌రికీ తెలుసు. అదే శిల్పాన్ని చిన్న బ‌ల‌పంపై చెక్కాలంటే...ఎంతో ఏకాగ్ర‌త అవ‌స‌రం. అదే చేసి చూపించాడు శ్రీరామోజు జ‌య‌కుమార్ అనే శిల్పి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాకతీయుల అద్భుతమైన శిల్ప కళా కేంద్రం రామప్ప ఆలయం. దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ ఈ శిల్పాన్ని చెక్కాడు. బలపంపై రామప్పలోని ఒక నాట్యకత్తె కొంగును కోతి లాగుతున్న శిల్పాన్ని అద్భుతంగా చెక్కి అబ్బురపరిచాడు

ఆ నాట్యకత్తె పవిటను మర్కటం (కోతి) లాగుతుంటే, చెయ్యెత్తి కొట్టబోతున్న శిల్పాన్ని అంద‌రూ ఆశ్చ‌ర్యంగా ప‌రిశీలిస్తున్నారు. ఈ క‌ళాఖండాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. జయకుమార్ ప్ర‌తిభ‌ను ఎంతో ప్ర‌శంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప ఆలయానికి, యునెస్కో అవార్డు రావడం,, తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికే గర్వకారణం అన్నారు. దాన్ని శిల్పంపైకి ఎక్కించిన క‌ళాకారుడిని అభినందించారు.

క‌ళాకారుడు జయకుమార్ మాట్లాడుతూ, చారిత్రిక రామప్ప ఆలయానికి యునెస్కో అవార్డు దక్కడం సంతోషకరమైన విషయమని, చారిత్రక కట్టడాలను సందర్శించడం, వాటిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వ్యాపార ప్రముఖులు రుద్ర ఓంప్రకాశ్, దాసరి నర్సింహారెడ్డి తదితరులు జయకుమార్ ను అభినందించారు.