1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (14:00 IST)

రాజీవ్ ఖేల్ ‌రత్న మాయం.. ఇకపై ధ్యాన్‌చంద్ర ఖేల్‌రత్నగా మార్పు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడ‌ల్లో అత్యున్న‌త పుర‌స్కారం అయిన రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాల‌ని త‌న‌కు దేశ‌వ్యాప్తంగా పౌరుల నుంచి అనేక విన‌తులు అందాయ‌ని ఈ సంద‌ర్భంగా మోడీ ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. 
 
దేశ ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి రాజీవ్ ఖేల్‌ర‌త్న అవార్డు పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జ‌యంతి అయిన ఆగ‌స్టు 29వ తేదీని ఇప్ప‌టికే జాతీయ క్రీడా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.
 
కాగా, మన దేశంలో ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాన్ని రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుగా పరిగణిస్తున్నారు. దానికింద ఒక ప్రశంసా పత్రం, పతకం, నగదు పురస్కారం అందిస్తారు. సాధారణంగా ఈ పురస్కారాన్ని ప్రకటించేందుకు ఏడాది ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తిగతంగా లేక జట్టుకు ఈ పురస్కారం ఇస్తారు. ఇప్పుడు ఆ పేరు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మారింది.