బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (21:18 IST)

ఏపీ వ్యాప్తంగా రూ.1337 కోట్లు పెన్షన్ పంపిణీ

ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షనర్ల చేతికి పెన్షన్ సొమ్మును అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటల వరకు 96.44 శాతం మందికి పెన్షన్లను పంపిణీ చేశారు.

వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి వాలంటీర్లు వారి పెన్షన్ సొమ్మును వారి ఇళ్ళకు వెళ్ళి లబ్ధిదారుల చేతికే అందించారు. ఉదయం నుంచే వాలంటీర్లు తమకు కేటాయించిన యాబై ఇళ్ళ పరిధిలోని వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారికి స్వయంగా పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు.

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2, 37,615 మంది వాలంటీర్లు కష్టపడి పనిచేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సంకల్పంను కార్యరూపంలోకి తీసుకురావడానికి సెక్రటేరియట్ స్థాయి ఉన్నతాధికారుల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగుల వరకు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

సాయంత్రం ఆరు గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 96.44 శాతం మందికి, అంటే దాదాపు 55,86,571 మంది లబ్ధిదారులకు రూ.1337.85 కోట్లను పెన్షన్ గా అందించారు. ముఖానికి మాస్క్ లు ధరించి, శానిటైజర్లను ఉపయోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కోవిడ్ -19 నియంత్రణ నిబంధనలు ఎక్కడా ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయో మెట్రిక్ వేయకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా జియోట్యాగింగ్ తో కూడిన ఫోటోలను వాలంటీర్లు ఫోన్ లో అప్ లోడ్ చేస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు. 

జూన్ నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం మొత్తం రూ.1402.70 కోట్లు విడుదల చేసింది. రెండు రోజుల కిందటే కే ఈ మొత్తంను పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ఫ్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేసింది.

సచివాలయ కార్యదర్శుల నుంచి సొమ్మును వాలంటీర్లకు అందచేయడం ద్వారా, సోమవారం ఉదయం నుంచే నేరుగా పెన్షనర్ల చేతికి పింఛన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో వుండిపోయినట్లయితే, వారిని కూడా గుర్తించి, పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందించాలన్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో సోమవారం పెన్షన్ సొమ్మును జమ చేశారు. ఎవరైనా జూన్ నెల పెన్షన్ సొమ్మును అనివార్య కారణాల వల్ల అందుకోలేక పోతే, వారికి జూలై నెలలో అందచేసే పెన్షన్ కు ఈ నెలది కూడా కలిపి అందిస్తామని సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు వెల్లడించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజున 55 లక్షలకు పైగా లబ్దిదారులకు రూ.1300 కోట్లకు పైగా పెన్షన్ సొమ్మును వారికి నేరుగా అందించిన వాలంటీర్లను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, పెన్షన్ల పంపిణీని విజయవంతం చేయడంలో వాలంటీర్లు చిత్తశుద్దితో పనిచేశారన్నారు.

గ్రామస్థాయిలో పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేసిన సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీ నిదర్శనమని కొనియాడారు. 
 
జిల్లాల వారీగా పెన్షన్ల పంపిణీ ఇలా...
* వైఎస్ఆర్ కడప: 3,15,820
* చిత్తూరు : 4,72,528
* విజయనగరం: 3,09,440
* ప.గో.జిల్లా : 4,46,196
* విశాఖపట్నం: 4,35,250
* శ్రీకాకుళం : 3,46,226
* అనంతపురం: 4,87,453
* తూ.గో.జిల్లా: 6,03,224
* నెల్లూరు : 3,22,612
* కర్నూలు : 4,03,067
* కృష్ణా: 4,60,127
* ప్రకాశం : 3,84,280
* గుంటూరు: 5,22,576