మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (11:46 IST)

ఏపీ వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు

ఏపీ వ్యాప్తంగా వైస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ఉధృతంగా కొనసాగుతోంది. ఒకవైపు కరోనా నిబంధనలను పాటిస్తూనే, మరోవైపు లక్షలాధి మంది పెన్షనర్ల చేతికే ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.

కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయో మెట్రిక్ కు బదులుగా ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా జియోట్యాగింగ్ తో కూడిన ఫోటోలను యాప్‌ లో అప్ లోడ్ చేస్తున్నారు‌. ఇందుకోసం ఇప్పటికే మొత్తం వాలంటీర్లకు ప్రభుత్వం అందచేసిన ఫోన్ లలో అధికారులు ఈ ప్రత్యేక యాప్ ను డౌన్ లోడ్ చేయించారు.

జూన్ నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం 1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసింది.‌ ఇప్పటికే ఈ మొత్తంను పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ఫ్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేయడం జరిగింది.

సచివాలయ కార్యదర్శుల నుంచి సొమ్మును వాలంటీర్లకు అందచేయడం ద్వారా, సోమవారం(జూన్ 1వ తేదీ) ఉదయం నుంచే నేరుగా పెన్షనర్ల చేతికి పింఛన్ సొమ్ము అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల వరకు భాగస్వాములు అవుతున్నారు.

లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో వుండిపోయినట్లయితే, వారిని కూడా గుర్తించి, పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందించాలన్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో పెన్షన్ సొమ్మును జమ చేస్తున్నామని పేర్కొన్నారు.