శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (18:56 IST)

వార్తల ప్రచురణలో చిన్న పత్రికలకే స్వేచ్ఛ ఎక్కువ: అంబటి ఆంజనేయులు

వార్తల ప్రచురణలో పెద్ద పత్రికల కన్నా చిన్న పత్రికలకే స్వేచ్ఛ ఎక్కువ అని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఉద్ఘాటించారు. సీనియర్ జర్నలిస్ట్ రమణారెడ్డి సారధ్యంలో ఎడిటర్ వాయిస్ పత్రికను స్థాపించి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ ప్రెస్  క్లబ్ లో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

"పెద్ద పత్రికలకు ప్రభుత్వం కాని, ప్రైవేటు కంపెనీలు కాని లక్షల్లో ప్రకటనలు ఇస్తుంటాయి. అందువలన ఆర్ధికంగా అవి నిలదొక్కుకోగలుతున్నాయి. కాని చిన్న పత్రికలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్వర్టయిజ్ మెంట్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెద్ద పత్రికల్లో పనిచేసి బయటకు వచ్చిన వారే చిన్న పత్రికలను పెట్టుకుని ఈ వృత్తిలో కొనసాగుతున్నారు” అని పేర్కొన్నారు.

చిన్న పత్రికలను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (సామ్నా)ను ఏ.పి.యూ. డబ్ల్యు.జె.కు అనుబంధంగా ఏర్పాటు చేయించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికల సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికపుడు సమావేశాల ద్వారా చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నామని ఆయన తెలిపారు.

చిన్న పత్రికల వలనే స్థానిక సమస్యలపై పోకస్ పెట్టవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిన్నపత్రికల పాత్ర శ్లాఘనీయం అని కొనియాడారు. 20 సంవత్సరాల నుంచి 'ఎడిటర్ వాయిస్' పత్రికను నిరాటంకంగా నడుపుతున్న ఎడిటర్ రమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ ఛాంబర్ పత్రిక సంపాదకులు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎం.సి దాస్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వార్తలు ప్రచురించి వాటి పరిష్కార దిశగా పత్రికలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నానాటికీ పత్రికలు చదివే పాఠకుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గ్రంధాలయాలలో పుస్తక పఠనం ఉండేదని, పత్రికలు చదివేవారని, కాని నేడు స్మార్ట్ ఫోన్ యుగంలో పత్రికలను, పుస్తకాలను చదవే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు.

సమాజంలోని నైతిక విలువలకు సంబంధించిన వార్తలను ప్రచురిస్తూ పత్రికలను నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఎడిటర్ వాయిస్ పత్రిక సంపాదకులు షి.హెచ్. రమణారెడ్డి తను పత్రికను ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో, తన పత్రిక ఎదుగుదలకు స్నేహితులు ఇచ్చిన విలువైన సూచనలు పనికి వచ్చాయని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఐజేయూ ఉ పాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, డాక్టర్ ఎం.సి దాస్ సంయుక్తంగా 20 సంవత్సరాల ఎడిటర్ వాయిస్ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎపియూడబ్ల్యూజె అర్బన్ అధ్యక్షుడు చావా రవి నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఏ.పి.యూ.డబ్ల్యు,జే జనరల్' సెక్రటరీ చందు జనార్ధన్, ఏ.పి.యూ. డబ్ల్యు.జే సీనియర్ నాయకులు ఎస్.కె.బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ప్రజాభీష్టం పత్రిక ఎడిటర్ ఎం.వి సుబ్బారావు పాల్గొని ప్రసంగించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఏ.పి.యూ.డబ్ల్యు.జె కృష్ణా అర్బన్ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, పూర్వపు అధ్యక్ష, కార్యదర్శులు జి. రామారావు, దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి వసంత్, జర్నలిస్టులు టి.నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు