1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (13:33 IST)

నైజీరియా - జింబాబ్వే కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ : యనమల రామకృష్ణుడు

yanamala
మున్ముందు నైజీరియా, జింబాబ్వే దేశాల కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబోతుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్‌ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో అభివృద్ధి అటకెక్కించారని, వ్యవసాయం నుంచి వృత్తులు, వ్యాపారాల వరకు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. 
 
మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమై ప్రజలపై భారాలు పెరిగి నైజీరియా, జింబాబ్వే కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్‌ తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'కాగ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పులు అసాధారణంగా పెరిగాయి. మూలధన వ్యయం దారుణంగా తగ్గింది. రెవెన్యూ పడిపోయింది. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం సింగిల్‌ డిజిట్‌కు దిగజారాయి. బయట అప్పులు (ఓపెన్‌ బారోయింగ్స్‌) 130 శాతానికిపైగా పెరిగాయి. 
 
బడ్జెట్‌లో చూపించకుండా రూ.4 లక్షల కోట్ల వరకు అప్పులు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ చర్యలను 15వ ఆర్థిక సంఘం కూడా తూర్పారబట్టింది. మూడున్నరేళ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారు. అయినా ప్రజల ఆదాయం పెరగలేదు. అభివృద్ధీ జరగలేదు. ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయం ఎటు పోతుందో కూడా లెక్కల్లేవు' అని యనమల ఏకవుపెట్టారు. 
 
'అప్పులపై ప్రస్తుతం ఏటా రూ.50 వేల కోట్లకుపైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే ప్రమాదం ఉంది. వడ్డీలే చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 35 శాతం మించకూడదు. వైకాపా ప్రభుత్వం 2021మార్చి నాటికి చేసిన అప్పులు 44.04శాతానికి చేరుకున్నాయి. అవి చెల్లించడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారు. ఇది అత్యంత దారుణమై చర్యగా ఆయన అభివర్ణించారు.