1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (15:44 IST)

ప్రాణాలు తీస్తున్న ఆంధ్రా రోడ్లు - గుంతలో పడి బైకర్ మృతి

road pothol
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఈ రోడ్లు ఇప్పటికే అనేక మంది ప్రాణాలను హరించాయి. తాజాగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ బైకర్ మృత్యువాతపడ్డారు. మరో వారం రోజుల్లో సౌతాఫ్రికాకు వెళ్లాల్సిన ప్రవీణ్... బుధవారం రాత్రి అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం వెళుతుండగా రోడ్డుపై ఉన్న గంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అత్తిలికి చెందిన ప్రవీణ్ కుమార్ దక్షిణాఫ్రికాలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సౌతాఫ్రికా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మరో వారం రోజుల్లో మళ్లీ ఆయన సౌతాఫ్రికాకు వెళ్లాల్సివుంది. 
 
బుధవారం రాత్రి ఒక పనిమీద అత్తిలి నుంచి తాడేపల్లిగూడెంకు బైక్‌పై ప్రవీణ్ బయలుదేరాడు.  అయితే, రావిగుంట వద్ద రోడ్డుపై గోతులు కనిపించక వేగంగా అలాగే, ముందుకు వెళ్ళాడు. బైక్ గొయ్యిలోకి వెళ్లి అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆయన బైక్‌పై నుంచి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.