1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:32 IST)

గుంటూరు జిల్లాలో కరోనా విశ్వరూపం.. రెడ్ జోన్లుగా ఆరు ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ విశ్వరూపం చూపించింది. ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది ముస్లింలు ఢిల్లీలో జరిగిన మర్కజ్ మత సమ్మేళనంలో పాల్గొని తిరిగివచ్చారు. ఇలా వచ్చిన వారిలో చాలా మందికి ఈ వైరస్ సోకింది. ఫలితంగా జిల్లాలో పలు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కరోనా వైరస్ సోకిన బాధితులు నివసించే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ ఓ ప్రకటన చేశారు.
 
జిల్లాలో గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మేడికొండూరు(తురకపాలెం), మంగళగిరి పాంత్రాలను రెడ్‌జోన్లుగా చేశామని చెప్పారు. రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో శనివారం నుంచి ఆంక్షలు కఠినతరంగా అమలు చేస్తామన్నారు. ఆ జోన్లలో ఏ ఒక్కరూ నిత్యావసర సరుకులకు కూడా బయటకు రావడానికి వీల్లేదని హెచ్చరించారు. 
 
అధికార యంత్రాంగమే ఆ ప్రాంతాలకు అన్ని సరుకులు తీసుకొచ్చి సరఫరా చేస్తుందన్నారు. వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
అదేవిధంగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 20 మందిని గుర్తిం చాల్సి ఉందని చెప్పారు. వైద్య, ఇతర సిబ్బందిని ఎవరైనా అడ్డగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణ, సహాయక చర్యల కోసం విరాళాలు ఇచ్చేవారు కలెక్టరేట్‌లో సంప్రదించాలని కలెక్టర్ ఆనంద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.