శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:59 IST)

విజయవాడలో దారుణం.. మహిళను బంధించి అత్యాచారం

victim
విజయవాడ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను తీసుకెళ్లిన ఓ గదిలో బంధించి మూడు రోజుల పాటు నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీన సనత్ నగర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు.
 
అక్కడ ఆమెను గదిలో బంధించిన అతనితో పాటు మరో ముగ్గురు కలిసి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. దీంతో ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తనపై జరిగిన అత్యాచారాన్ని వైద్యులకు బాధితురాలు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు పెనమలూరు పోలీసులు బాధితురాలితో మాట్లాడి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.