1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 8 జులై 2022 (18:20 IST)

పావురాల గుట్టలోనే సంఘర్షణ మొదలైంది.. ప్లీనరీ ప్రారంభోపన్యాసంలో జగన్

ys jagan
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్థానాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు వివరించారు. 13 ఏళ్ల కిందట పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి ప్రస్తుతం అధికారంలోకి వచ్చినంత వరకు ఎదురైన అనుభవాలు, సంఘర్షణ అన్నిటినీ ఆయన ప్రస్తావించారు.


‘‘2009 సెప్టెంబరు 5న పావురాల గుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీ రూపం దాల్చింది. ఆ తరువాత 2011లో వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించింది’’ అని జగన్ చెప్పారు.

 
‘‘ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడికి, అక్కకి, చెల్లెమ్మకి, అవ్వా, తాతలకి, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్‌ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా, మీవాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్‌ చేస్తున్నాను’’ అంటూ జగన్ తన ప్రసంగంలో అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

 
2009 నుంచి ఇప్పటివరకు 13 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని.. అయినా తన సంకల్పం చెదరలేదని జగన్ చెప్పారు. ‘‘అధికారం అంటే అహంకారం కాదు. అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాలలో అయినా ప్రజల కోసం, పేదల కోసం, సామాన్యుల కోసం, అన్ని వర్గాల కోసం బతికాం’’ అన్నారు జగన్. జగన్ తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నేతలపైనా విమర్శలు కురిపించారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం కార్యకర్తలనుద్దేశించి మరోసారి మాట్లాడుతానని చెప్పారు.